Tuesday, May 15, 2018

బీసీ నిరుద్యోగ యువతకు శుభవార్త..కార్పొరేషన్ రుణాలు సులభం

బీసీ నిరుద్యోగ యువతకు శుభవార్త..కార్పొరేషన్ రుణాలు సులభం


 ఈ ఆర్థిక సంవత్సరం రాయితీ రుణాల కోసం ఎదురుచూస్తున్న బీసీ నిరుద్యోగ యువతకు సర్కారు శుభవార్త తెలిపింది. గత నెల గడువులోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి రాయితీ రుణాలిచ్చేందుకు బీసీల అభివృద్ధి శాఖ సన్నాహాలు ముమ్మరం చేసింది. అంతే కాకుండా గతంలో బ్యాంకు అధికారులు లబ్ధిదారులకు రుణాల మంజూరులో వ్యవహరించిన తీరును పరిగణలోకి తీసుకొని బ్యాంకుల ప్రమేయం లేకుండానే సులువుగా రుణాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం గత శుక్రవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. నిరుద్యోగ యువత ఉపాధి కోసం కార్పొరేషన్ల ద్వారా భారీ రాయితీ రుణాలు అందజేసి వారిని ఆదుకోవాలన్న ప్రభుత్వ సంకల్పానికి.. బ్యాంకర్లు సవా లక్ష ఆంక్షలు విధిస్తూ వారి ఆశలను అడియాసలు చేసేవారు.


bc-development-department-gives-subsidy-loans-to-unemployed-bc-youth-tsobmms.cgg.gov.in
bc-development-department-gives-subsidy-loans-to-unemployed-bc-youth-tsobmms.cgg.gov.in


ప్రభుత్వం కరుణించినా బ్యాంకర్లు స్పందించకపోవడంతో కాళ్లు అరిగేలా బ్యాంకుల చుట్టూ చక్కర్లు కొడతూ రుణాల మాటెత్తితేనే నిరుద్యోగ యువత బెంబేలెత్తే పరిస్థితి నెలకొన్నది. ఉదాహరణకు రూ.లక్ష రాయితీ రుణంలో 80 శాతం అంటే రూ.80వేలు ప్రభుత్వం రాయితీగా భరించేది. మిగిలిన రూ.20వేలు మాత్రం బ్యాంకు రుణం మంజూరు చేసేది. ఆ ఇచ్చే కేవలం రూ.20వేల రుణానికి రూ.50 వేలు ఫిక్సిడ్ డిపాజిట్ చేయడంతో పాటు మరో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల గ్యారెంటీ ఇస్తేనే రుణం మంజూరు చేస్తామని లబ్ధిదారులను వేధింపులకు గురిచేసేవి.

దీంతో రాయితీ రుణాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలనుకున్న లబ్ధిదారుల కల కలగానే మిగిలేది. మంజూరైన రుణాలు కూడా తిరిగి ప్రభుత్వ ఖజానాకు కూడా వెళ్లేవి. రాయితీ రుణాలు సులభం చేస్తూ.. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కార్పొరేషన్ రాయితీ రుణాల మంజూరు మరింత సులభతరమైనది.

గతంలో లబ్ధిదారులను బ్యాంకర్లు వేధించిన తీరును పరిగణలోకి తీసుకొని గత శుక్రవారం వెలువడిన తాజాగా జీవో ఎంఎస్ నంబరు. 10 కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇక నుంచి రాయితీ రుణం తీసుకొనే నిరుద్యోగ యువతకు బ్యాంకుతో ప్రమేయం లేకుండా నేరుగా రుణం పొందే వెసులుబాటు కల్పించింది సర్కారు. కేటగిరి-1లో రూ.లక్ష రుణానికి 80 శాతం రాయితీ, కేటగిరీ-2లో రూ.2లక్షలకు 70 శాతం రాయితీ, కేటగిరి-3లో రూ.2లక్షల నుంచి 12లక్షల లోపు రుణాలకు 60శాతం రాయితీ కల్పిస్తున్నది. అయితే ఇందులో రాయితీ పోను మార్జిన్ మనీని మాత్రమే బ్యాంకులు రుణంగా ఇచ్చేవి..తాజా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం..

మార్జిన్ మనీని లబ్ధిదారుడే డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో కార్పొరేషన్‌కు చెల్లిస్తే.. ప్రభుత్వ రాయితీతో పాటు లబ్ధిదారుడి మార్జిన్ మనీని కలిపి మొత్తం రాయితీ నగదు కార్పొరేషన్ చెక్కు ద్వారా చెల్లిస్తున్నది. ఈ విధానంతో బ్యాంకుల ఊసే లేకుండా.. నెల నెలా వాయిదాల కట్టే పనే లేకుండా..అందిన పూర్తి మొత్తంతో లబ్ధిదారుడు తన వ్యాపారాన్ని విస్తరించుకొని ఉపాధి పొందే వీలుంది.

Official website
హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాయితీ రుణాల నమోదు కోసం గత ఏప్రిల్ నెల 21న తుది గడువు ముగిసింది. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ రాయితీ రుణాల కోసం ఆయా కేటగిరిల్లో మొత్తం 14వేల 896 మంది లబ్ధ్ధిదారులు ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకున్నారు. 25 వతేదీ లోపు కేటగిరి-1, వచ్చే నెల 15వతేదీ లోపు కేటగిరి-2, వచ్చే నెల 25వ తేదీ లోపు కేటగిరి-3 వారీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొససాగుతున్నది. ఎంపికైన లబ్ధిదారులకు వెంటనే రాయితీ రుణాలు ఇచ్చే విధంగా సంబంధిత అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

త్వరలోనే కార్పొరేషన్ రాయితీలు హైదారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో స్వీకరించిన మొత్తం దరఖాస్తు పరిశీలన కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. కేటగిరీల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి రాయితీ అందజేందుకు కసరత్తు చేసున్నాం. ఇక నుంచి బ్యాంకుల ప్రమేయం లేకుండా రాయితీని అందజేస్తున్నాం.. దీంతో ఈ సారి ఎక్కువ మంది నిరుద్యోగ యువత లబ్ధిపొందనుంది.

-మంజుల, బీసీ సంక్షేమశాఖ, హైదరాబాద్ జిల్లా ఉపసంచాలకులు